న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణ ప్రణాళికలను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దూకుడుగా చేపడుతోంది. పంజాబ్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటి దీటైన విపక్షంగా తాము ఎదుగుతామనే సంకేతాలు పంపేందుకు ప్రణాళికాబద్ధంగా పావులు కదుపుతోంది. ఈ దిశగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్ధులను ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రకటించి ప్రచారాన్ని హోరెత్తించేలా వ్యూహాలకు పదునుపెడుతోంది.
2022లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నద్ధమైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. పది మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆప్ ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని శక్తియుక్తులను కూడదీసుకుంటోంది. పంజాబ్లో తమ పార్టీ అధికార పగ్గాలు చేపడితే ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం వంటి పలు హామీలను ఆప్ ప్రకటించింది.