Gujarat Elections | ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా పది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. భీమాభాయ్ చౌదరి, జగ్మల్ వాలా, అర్జున్ రథ్వా, సాగర్ రాబరీ, వశ్రమ్, రామ్ ధనుక్, శివలాల్ బరాసియా, సునీల్ వఘాని, రాజేంద్ర సోలంకి, ఓంప్రకాశ్ తివారీ పేర్లతో జాబితాను ప్రకటించింది.
గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఎన్నికల్లో విజయం అనంతరం ఆ పార్టీ గుజరాత్పై కన్నేసింది. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే గుజరాత్లోని ప్రతి యువకుడికి ప్రతి నెలా రూ.3వేల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. అలాగే నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
సౌరాష్ట్ర ప్రాంతంలోని గిర్ సోమనాథ్ జిల్లా వెరావల్ పట్టణంలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఢిల్లీ సీఎం మాట్లాడుతూ.. గుజరాత్లో ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, వచ్చే ఐదేళ్లలో ప్రతి నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగాలు కల్పించే వరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.3వేల భృతి ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ను అరికట్టేందుకు, దోషులను శిక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తానని హామీ ఇచ్చారు.