న్యూఢిల్లీ: నీచ రాజకీయాలకు బీజేపీ చిరునామాగా మారిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ విమర్శించారు. ఆదిపురుష్ సినిమాను బీజేపీ రాజకీయాలకు వాడుకుంటున్నదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నట్టు ఆదిపురుష్ సినిమా మరోసారి నిరూపించిందని ఎంపీ పేర్కొన్నారు. బీజేపీ, మిత్రపక్ష నేతలు యోగి ఆదిత్యనాథ్, ఏక్నాథ్శిండే, శివరాజ్సింగ్ చౌహన్, దేవేంద్ర ఫడ్నవీస్, మనోహర్లాల్ ఖట్టర్, హిమంత బిశ్వ శర్మ, పుష్కర్సింగ్ ధామి, నరోత్తమ్ మిశ్రా తదితరులు ఆదిపురుష్ సినిమా బాగుందని, అందరూ వీక్షించాలని పిలుపునిచ్చారు. దీనిపై ఆప్ మండిపడింది. ‘బీజేపీ రాముడికి, సాధారణ ప్రజలకు ఏమీ చేయదు… నీచ రాజకీయాలు మాత్రమే చేస్తుంది’ అని సంజయ్సింగ్ విమర్శించారు. హిందువుల మనోభావాలకు విఘాతం కలిగించిన సినిమా డైరెక్టర్, డైలాగ్ రైటర్ క్షమాపణలు చెప్పాలని శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.