పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎస్టీల సంక్షేమానికి పలు హామీలు గుప్పించింది. ఎస్టీల అభివృద్ధి కోసం ఎనిమిది అంశాలతో కూడిన అజెండాను ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం వెల్లడించారు. గోవాలో గత ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కి ఎస్టీల సంక్షేమాన్ని విస్మరించాయని ఆరోపించారు. బడ్జెట్లో పొందుపరిచే ట్రైబల్ సబ్ప్లాన్ను పూర్తిగా గిరిజనుల సంక్షేమానికి వెచ్చిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.
ఎస్టీలకు కేటాయించిన 3000 ఖాళీలను తక్షణమే భర్తీ చేస్తామని, ఎస్టీలకు ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఎస్టీలకు 12.5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎస్టీ మహిళలకు నెలకు రూ 1000 నగదు సాయం అందిస్తామని, నిరుద్యోగ యువతకు నెలకు రూ 3000 ఇస్తామని హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి 14న గోవా అసెంబ్లీ ఎన్నికలకు ఒకే దశలో జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇక గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీ అధికారం నిలుపుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుండగా, కాంగ్రెస్, ఆప్, టీఎంసీలు సత్తా చాటేందుకు చెమటోడుస్తున్నాయి. ఇక గోవాలో కాంగ్రెస్తో ఎన్నికలకు ముందు ఎలాంటి పొత్తు ఉండదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తోసిపుచ్చారు.