న్యూఢిల్లీ: తమ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ చైర్మన్ను కోరింది. ఈ మేరకు ఆయనకు పిటిషన్ సమర్పించినట్టు ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. ఆ ఏడుగురు ఎంపీలు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. అవసరమైతే వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతామని ఆయన ప్రకటించారు.
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ని ఉదహరిస్తూ ఈ తరహా రాజకీయ ఫిరాయింపులు ఉపేక్షించబడవని.. సుప్రీం కోర్ట్ తీర్పుల ప్రకారం ఈ తరహా ఫిరాయింపులు అనర్హతకు దారి తీస్తాయని తెలిపారు. పంజాబ్లోని కొందరు ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారన్న వార్తలను సింగ్ ఖండించారు.
కేజ్రీవాల్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ‘శీష్ మహల్ 2’గా ప్రచారం చేస్తూ.. దాని సుందరీకరణకు ప్రైవేట్ డబ్బును ఖర్చు పెట్టారన్న తప్పుడు వార్తలను ప్రసారం చేసిన చానళ్లపై పరువు నష్టం దావా వేస్తామని చెప్పారు.