Delhi Mayor Poll | ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిబంధనల మేరకు మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా నామినేటెడ్ సభ్యుల ప్రమాణాలు చేపడుతున్నారని ఆప్ తన పిటిషన్లో పేర్కొన్నది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. రేపటికి విచారణను వాయిదా వేసింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తలుపులు తడతామని నాలుగు రోజుల క్రితం చెప్పినట్లుగానే ఆప్.. సుప్రీంను ఆశ్రయించింది.
ఢిల్లీలో కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన అభ్యర్థుల ఓటింగ్ హక్కులను ఆప్ వ్యతిరేకిస్తున్నది. దీనిపై ఆప్ తరఫు సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 ఆర్ కు వ్యతిరేకంగా మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులకు ఓటు వేయడానికి అనుమతించారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు కోర్టు కేసుల్లో దోషులుగా తేలినందున వారిని ఓటరు జాబితా నుంచి తొలగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదంతా తాత్కాలిక ప్రొటెం పర్సన్ పర్యవేక్షణలో జరుగుతున్నదని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణను చేపట్టిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ పార్ధీవాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం .. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండిగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఆప్, బీజేపీ సభ్యుల ఆందోళనలు, గందరగోళం మధ్య జనవరి 6, 24 తేదీల్లో వాయిదా పడ్డాయి. సోమవారం కూడా మరోసారి మేయర్ ఎన్నిక వాయిదా పడింది. డిసెంబరు 7న ప్రకటించిన ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ మెజారిటీ సాధించినప్పటికీ మేయర్ ఎన్నిక ఆలస్యమవుతూ వస్తున్నది. ఎంసీడీ ఎన్నికలో ఆప్ 134 డివిజన్లలో గెలిచి స్పష్టమైన మెజార్టీ సాధించింది. బీజేపీకి కేవలం 104 స్థానాలే వచ్చాయి. అయినప్పటికీ ఎంసీడీ మేయర్ పదవిని తమ అకౌంట్లో వేసుకునేందుకు కుట్ర పన్నడం వల్లనే ఎన్నిక వాయిదా పడుతూ వస్తున్నది.