న్యూఢిల్లీ : ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్పురి ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతకు పాల్పడగా బుల్డోజర్లను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ నిరసన చేపట్టారు.
ఆస్తులకు సంబంధించి ప్రజల వద్ద సరైన పత్రాలు ఉన్నా వారి ఇండ్లు, దుకాణాలను కూల్చేస్తున్నారని ఆప్ ఎమ్మెల్యే మండిపడ్డారు. తమ ఇండ్లను ఎందుకు కూల్చివేస్తున్నారని స్ధానికులు నిరసనకు దిగినా పారామిలటరీ బలగాలు, పోలీస్ భద్రత నడుమ అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే షహీన్బాగ్, జహంగిర్పురి, మదన్పూర్ ఖదర్, న్యూ ఫ్రెండ్స్ కాలనీ, మంగోల్పురి, గోకుల్పురి, లోధి కాలనీ, జనక్పురి సహా పలుచోట్ల ఆక్రమణల కూల్చివేతను స్ధానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.
బీజేపీ పాలక మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న కూల్చివేతలపై నిరసనలు చేపట్టాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆప్ ఎమ్మెల్యేలను కోరారు. బీజేపీ పాలక కార్పొరేషన్లు చేపట్టిన బుల్డోజర్ చర్యలను అనుమతించబోమని కేజ్రీవాల్ హెచ్చరించారు. ఈ ప్రక్రియతో వేలాది మంది రాజధాని వాసులు నిరాశ్రయులవుతారని హెచ్చరించారు.