న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్(Rajendra Pal Gautam) వివాదంలో ఇరుక్కున్నారు. సామూహిక మత మార్పిడి కార్యక్రంలో ఆయన పాల్గొన్నారు. బౌద్ధమతం స్వీకరించాలని చేసిన ప్రతిజ్ఞలో పాల్గొన్న ఆయన హిందూ దేవుళ్లను పూజించరాదు అంటూ పేర్కొన్నారు. సామూహికంగా జరిగిన ఆ కార్యక్రమంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది.
అంబేద్కర్ బౌద్ధం స్వీకరించిన సమయంలో ధమ్మ చక్ర ప్రవర్తన్ దిన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి ఏడాది కూడా ఈ దినాన్ని పాటిస్తున్నారు. వేలాది మంది బౌద్ధం స్వీకరించిన తాజా కార్యక్రమంలో ఆప్ మంత్రి గౌతమ్ పాల్గొన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడిపై తనకు నమ్మకం లేదని, వాళ్లను పూజించను అని ఆయన ప్రతిన చేశారు.
ఇది హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని అవమానించడమే అని బీజేపీ ఆరోపించింది. ఆప్ మంత్రులు మత ఘర్షణలను సృష్టిస్తున్నట్లు బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ఆరోపించారు. ఆ మంత్రిని తక్షణమే క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తనకు బౌద్ధంపై నమ్మకం ఉందని, రాజ్యాంగం ప్రకారమే మత స్వేచ్ఛను పాటిస్తున్నట్లు మంత్రి గౌతమ్ తెలిపారు.