Fauja Singh Resigns | పంజాబ్లో మరో మంత్రి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారం చేపట్టిన 10 నెలల వ్యవధిలోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. ఇద్దరు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొని మంత్రి పదవులను వదులుకున్నారు. కాగా, ఇవాళ సాయంత్రం ఒకరిద్దరి చేత మంత్రులుగా ప్రమాణం చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పంజాబ్కు చెందిన ఫౌజీ సింగ్ సరారీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం భగవంత్ మాన్కు సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తన రాజీనామా లేఖలో సరారీ పేర్కొన్నారు. భగవంత్ సింగ్ మంత్రిమండలిలో సరారీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నారు. సీఎం భగవంత్ సింగ్ జర్మనీ పర్యటనలో ఉన్న సమయంలో సరారీపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సరారీ తన పీఏతో మాట్లాడిన ఆడియో వైరల్గా మారడంతో.. ఆయనను మంత్రమండలి నుంచి తప్పించాలనే డిమాండ్ ఊపందుకున్నది. ఫౌజా సింగ్ సరారీ పంజాబ్ పోలీసు ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తొలిసారి ఆప్ తరఫున పోటీ చేసి ఫిరోజ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పంజాబ్లో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం విశేషం. ఇప్పటికే ఆరోగ్య మంత్రిగా పనిచేసిన డాక్టర్ విజయ్ సింగ్లాను మంత్రిమండలి నుంచి తొలగించారు. డిపార్ట్మెంట్ టెండర్లలో కమీషన్లు తీసుకున్నారని డాక్టర్ సింగ్లాపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అవినీతి ఆరోపణలపై ఫౌజా సింగ్ సరారీ కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆప్ వర్గాల సమాచారం మేరకు, ఇవాళ సాయంత్రానికి ఒకరిద్దరిచేత గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించే అవకాశాలు ఉన్నాయి. మంత్రిమండలి నుంచి ఇద్దరు తప్పుకోవడంతో ఆ స్థానాలను ఇద్దరితో భర్తీ చేయనున్నట్లు సమాచారం. పాటియాలా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ బల్బీర్ సింగ్ను మంత్రి పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.