AAP | ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు తీరుకు వ్యకతిరేకంగా దేశ రాజధానిలోని రామ్లీలా మైదానంలో (Ramlila Maidan) మహా ర్యాలీ (Maha Rally) నిర్వహిస్తున్నది. ఈ నిరసన కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నదని పార్టీ నాయకులు ఇప్పటికే వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్తోపాటు (Bhagwant Mann) పార్టీ నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రామ్లీలా మైదాన్ చుట్టూ భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు. కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు వాహనాల రాకపోకలను నియంత్రించాలని ట్రాఫిక్ పోలీసులను కోరారు. అదేవిధంగా అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సులను వేదిక వద్దకు తరలించారు. రామ్లీలా మైదానం ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లు, ఆ ప్రాంతం చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఢిల్లీలో పాలనాధికారం మొత్తం ప్రజాప్రభుత్వానిదేనని సుంప్రీం కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి విరుద్ధంగా అధికారుల బదిలీలు, పోస్టింగ్ల కోసం కేంద్రం నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు దిశగా కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది. అయితే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్ బీజేపీయేతర పార్టీల మద్దతును కోరింది. ఇది విపక్షాలకు అగ్నిపరీక్ష సమయమని దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలనుకునే పార్టీలు ముందుకు రావాలని ఆప్ పిలుపు ఇచ్చింది. రాజ్యసభలో ఆర్డినెన్సును అడ్డుకోవడానికి విపక్షాలను కూడగడుతున్నది. ఇందులో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ప్రతిపక్ష పార్టీల అధినేతలను కలుస్తున్న సంగతి విధితమే.