(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): మద్యం పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హత్యకు పెద్ద కుట్ర జరుగుతున్నదని ఆ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇందులో భాగంగానే ఇంటి భోజనాన్ని ఆయనకు ఇవ్వనీయకుండా అడ్డుకొనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్టు ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఈ కుట్రలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్కు చక్కెర స్థాయిలు పెరిగాయన్న ఆతిశీ.. ఇన్సులిన్ ఇచ్చేందుకు కూడా తీహార్ జైలు అధికారులు అనుమతినివ్వట్లేదని ఆరోపించారు. ఈడీ కోర్టులో చెప్తున్నదంతా అబద్ధమేనని ఆమె ధ్వజమెత్తారు.
అసలేం జరిగిందంటే?
మధుమేహంతో బాధ పడుతున్న కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవెల్ ఏప్రిల్ 14 నాటికి 276 ఎంజీ/డీఎల్గా నమోదైంది. దీంతో వైద్యుడిని కలిసేందుకు అనుమతించాల్సిందిగా కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం కోర్టు విచారణ జరిపింది. అయితే, ఈ పిటిషన్ను వ్యతిరేకించిన ఈడీ.. విచారణ సందర్భంగా కేజ్రీవాల్పై పలు ఆరోపణలు చేసింది. ‘ఇంటి భోజనానికి కేజ్రీవాల్కు అనుమతి ఉన్నది.
దీంతో ఇష్టమైన ఆహారం తినేసి.. తద్వారా షుగర్ లెవెల్స్ పెంచుకొని, ఆరోగ్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు’ అని ఈడీ మండిపడింది. ఈడీ ఆరోపణలను కేజ్రీవాల్ న్యాయవాది తిప్పికొట్టారు. మీడియా ప్రచారం కోసం ఈడీ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నదని మండిపడ్డారు. దీంతో కేజ్రీవాల్ తీసుకోవాల్సిన డైట్ వివరాలు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాదిని, జైలులో ఇస్తున్న ఆహార వివరాలు అందించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
కృత్రిమ చక్కెరను వాడుతున్నారు
ఈడీ చేసిన ఆరోపణలను ఆప్ నేతలు ఖండించారు. ‘మధుమేహ రోగులకు సిఫారసు చేసే కృత్రిమ చక్కెరను మాత్రమే కేజ్రీవాల్ వాడుతున్నారు. మధుమేహ రోగులకు షుగర్ స్థాయిలు ఎప్పుడైనా పడిపోవచ్చు. అందుకే అరటిపండ్లు, చాక్లెట్ల వంటివి దగ్గర పెట్టుకోవాలని వైద్యులే సలహా ఇస్తారు. దాన్ని కూడా ఈడీ తప్పుగా చిత్రీకరించి అసత్యాలు వల్లెవేస్తున్నది’ అంటూ ఆతిశీ మండిపడ్డారు.