Bhagwant Mann : పంజాబ్లో సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం శుక్రవారం అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మే డే సందర్భంగా ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో భాగంగా నిర్వహించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై ఆప్ విజయం సాధించిన సందర్భంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో విబేధాలున్నాయని, బలహీనంగా మారిందని జరుగుతున్న ప్రచారానికి దీంతో తెరపడిందని ఆయన అన్నారు.
ఇది ఆప్ ఎమ్మెల్యేల ఐక్యతను చాటిందని, పార్టీలో చీలిక వచ్చిందని, 40 మందికిపైగా ఆప్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి, బీజేపీలో చేరుతారనే ప్రచారానికి తెరపడిందని భగవంత్ మాన్ అన్నారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పుకోవాలి. ముఖ్యంగా పంజాబ్ నుంచి ఎన్నికైన రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మూడింట రెండొంతుల మంది ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడిందని ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో పంజాబ్లో పార్టీ అవిశ్వాసం నెగ్గడం ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లే. అది కూడా బీజేపీ ప్రవేశపెటిన అవిశ్వాసం వీగిపోవడం ఆప్నకు ఊరట కలిగించింది.
అయితే, ఈ సమావేశంలో సీఎం భగవంత్ మాన్ మద్యం సేవించి సభకు వచ్చారని బీజేపీ సహా కాంగ్రెస్, ఇతర సభ్యులు ఆరోపించారు. తన ప్రసంగం సందర్భంగా సీఎం పలుమార్లు తడబడిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ ఆరోపణలు చేశాయి. ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశాయి. అయితే, ఈ ప్రతిపాదనను సీఎం తిరస్కరించారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలను భగవంత్ మాన్ ఖండించారు. సభలో ఇలాంటి వాదనలకు దూరంగా ఉండి, హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ప్రతిపక్షాలు అసలు సమస్యపై మాట్లాడటం లేదని విమర్శించారు.
ఈ ఆరోపణలను సీఎం తోసిపుచ్చారు.