లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ముజఫర్ నగర్ జిల్లాలోని మీరాన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున జోగిందర్ సింగ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. దీంతో అతను తన నామినేషన్ పత్రాలను సోమవారం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్కు సమర్పించాడు.
అయితే నామినేషన్ పత్రాల్లో కొన్ని తప్పులు దొర్లడంతో ఎన్నికల అధికారి తిరస్కరించాడు. ఈ క్రమంలో జోగిందర్ సింగ్.. ఆ కార్యాలయం ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై సింగ్ వద్ద ఉన్న అగ్గిపెట్టెను లాగేసుకున్నారు.
అనంతరం జోగిందర్ సింగ్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు కూర్చున్నాడు. నామినేషన్ పత్రంలో తప్పును సరిదిద్దుకునేందుకు కూడా ఎన్నికల అధికారి తనకు సమయం ఇవ్వలేదని ఆరోపించాడు. జోగిందర్ సింగ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్.