చండీఘడ్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ భవన్లో మంగళవారం నిర్వహించే విలేకరుల సమావేశానికి పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కార్యాలయం అనుమతి నిరాకరించిందని ఆప్ ఆరోపించింది. సీఎంఓ అనుమతి లేకున్నా ప్రెస్మీట్ నిర్వహించి తీరుతామని స్పష్టం చేసింది. కెప్టెన్ సింగ్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా షెడ్యూల్ ప్రకారం విలేకరుల సమావేశం నిర్వహిస్తామని ఆప్ పేర్కొంది.
మరోవైపు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే ఉచిత విద్యుత్ అందిస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. రాష్ట్రంలో ధరల పెరుగుదలతో మహిళలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిక్కు నేతను ముందుకు తెస్తామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది.