న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: భారత ఎన్నికల సంఘం(ఈసీ)పై ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈసీ బీజేపీ విభాగంలా పనిచేస్తున్నదని విమర్శించింది. సోషల్ మీడియాలో బీజేపీ పెడుతున్న పోస్టులపై, హోర్డింగ్లపై ఆప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ పార్టీ ప్రధాన జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మరోవైపు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ, టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిలకు చెందిన కొన్ని పోస్టులను తొలగించాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ను ఈసీ ఆదేశించిన సంగతిని కక్కర్ ప్రస్తావించారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల సంఘం బీజేపీకి అనుబంధ విభాగంలా మారిందనిపిస్తుందని ఆమె ఆరోపించారు.