న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘అంబేద్కర్ ఫెలోషిప్ ఫర్ పొలిటికల్ చేంజ్’ను ప్రారంభిస్తున్నట్టు ఆ పార్టీ ఆదివారం ప్రకటించింది. రాజకీయాల పట్ల మక్కువ, దేశాన్ని సంస్కరించాలనే ఉత్సాహం ఉన్న యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఎంపికైన అభ్యర్థులను క్షేత్రస్థాయి ప్రచారం, మీడియా, కమ్యూనికేషన్స్, పరిశోధన, డాటా విశ్లేషణ వంటి వాటిలో నియమిస్తారు.
ఈ ఫెలోషిప్ 11 నెలలు ఉంటుందని, సీనియర్ నేతలు, నిపుణులతో పనిచేయడం ద్వారా రాజకీయ అనుభవం పొందుతారని ఆప్ తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నది. వయసు 40 ఏండ్ల కంటే తక్కువ ఉన్న వారు అర్హులని తెలిపింది. దరఖాస్తుల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా నియామక ప్రక్రియ ఉంటుందని తెలిపింది.