న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిలు మంజూరైన సంతోషం కాసేపైనా లేకుండా పోయింది. ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు వేర్వేరు కేసుల్లో సమన్లను జారీ చేసింది. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ, రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి ఈడీ, సీబీఐలను తన గూండాలుగా బీజేపీ ఉపయోగించుకుంటున్నదని ఆరోపించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తొమ్మిదోసారి, ఢిల్లీ జల మండలి (డీజేబీ) కేసులో తొలి సారి కేజ్రీవాల్కు ఈడీ ఆదివారం సమన్లు జారీ చేసింది. డీజేబీ కేసులో ఈ నెల 18న, మద్యం పాలసీ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఈడీ సమన్లపై ఢిల్లీ రాష్ట్ర మంత్రి, ఆప్ నేత అతిశీ ఆదివారం విలేకర్ల సమావేశంలో ఘాటుగా స్పందించారు. ఢిల్లీ జల మండలికి సంబంధించిన బూటకపు కేసులో కేజ్రీవాల్కు ఈడీ సమన్లను జారీ చేసిందని మండిపడ్డారు. ఈ కేసు గురించి ఎవరికీ తెలియదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా నిలువరించడం కోసం ఏదో ఓ విధంగా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో రచించిన ప్రణాళికగా ఇది కనిపిస్తున్నదని ఆరోపించారు. ఢిల్లీలో లోక్సభ ఎన్నికల్లో పోరాడకుండా కేజ్రీవాల్ను ఆపడమే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ ఉద్దేశమనే విషయం స్పష్టమవుతున్నదన్నారు. న్యాయస్థానాలు, ప్రజాస్వామ్యం, న్యాయ వ్యవస్థలను మోదీ, బీజేపీ పట్టించుకోవడం లేదని, కేవలం ఎన్నికల గురించి, వాటిలో పాల్గొనకుండా ప్రతిపక్షాలను కట్టడి చేయడం గురించి మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి ఈడీ, సీబీఐలను తన గూండాలుగా బీజేపీ వాడుకుంటున్నదన్నారు.