Aaftab Poonawala | సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. శ్రద్దా చనిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు ఆమె ఫోన్ను ఆఫ్తాబ్ తన వద్దే ఉంచుకున్నట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ముంబయిలో విచారణకు హాజరైన సమయంలో శ్రద్దా ఫోన్ అతని వద్దే ఉన్నట్లు తెలిపారు.
శ్రద్ద అదృశ్యంపై ఆమె కుటుంబసభ్యులు నవంబర్ నెలలో ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆఫ్తాబ్ను ముంబయికి పిలిపించి విచారించారు. ఆ సమయంలో ఆఫ్తాబ్ వద్ద శ్రద్ద ఫోన్ ఉన్నట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. అయితే, ఆ ఫోన్ కారణంగా తాను చిక్కుల్లో పడే అవకాశం ఉందని గ్రహించిన ఆఫ్తాబ్.. విచారణ అనంతరం ముంబయి నుంచి ఢిల్లీ వస్తున్న సమయంలో శ్రద్దా ఫోన్ను సముద్రంలోకి పడేసినట్లు తెలిపారు.
సహజీవనం చేస్తున్న ప్రియురాలు శ్రద్దా వాకర్ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా ఈ ఏడాది మే 18వ తేదీన దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఫ్రిజ్లో దాచిన శరీర భాగాలను ఢిల్లీ పరిసరాల్లో పడేశాడు. నిందితుడు ఆఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణం గురించి అతడే వెల్లడించాడు. దీంతో ఈ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. కేసు విచారణలో భాగంగా.. శ్రద్దాను తానే హత్య చేసినట్లు కోర్టు ముందు ఆఫ్తాబ్ అంగీకరించాడు.