ముంబై : మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై రాష్ట్ర మంత్రి, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్యా ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మరువలేమని వ్యాఖ్యానించారు. ఈ పోరాటంలో తాము (శివసేన) విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండేకు శివసేన షాక్ ఇచ్చింది.
పార్టీ పేరును, వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఇతరులెవరూ వాడకూడదని సేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. పార్టీని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అధికారాన్ని ఉద్ధవ్ ఠాక్రేకు కట్టబెట్టింది. ఇక ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం సవాల్ విసిరారు.
సేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు. సేన కార్యకర్తలు దాదాగిరి చేస్తే తాము దీటుగా బదులిస్తామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదని అన్నారు. శివసేన అంతర్గత వివాదంలో తాము చేసేదేమీ లేదని దేవేంద్ర ఫడ్నవీస్ తనతో అన్నారని కేంద్ర మంత్రి చెప్పారు. ఠాక్రే, ఏక్నాథ్ షిండేలు తమ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవాలని అన్నారు.