ముంబై: ‘ఓడలు బండ్లు, బండ్లు ఓడలు’ అవుతాయన్న సామెతకు మహారాష్ట్ర రాజకీయాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నిన్నటి వరకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వారసుడిగా, మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేపై అనర్హత వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయిన ఆదిత్య ఠాక్రే విప్ను ఉల్లంఘించినందుకు సేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ఈ దిశగా చర్యలు తీసుకోవచ్చని తెలుస్తున్నది. మహారాష్ట్రలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో సోమవారం బలపరీక్షను ఎదుర్కొని గెలిచారు.
మరోవైపు ఆదివారం ఎన్నికైన అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్, సీఎం ఏక్నాథ్ షిండేను శివసేన శాసనసభా పక్ష నేతగా గుర్తించారు. తిరుగుబాటు నేత భరత్ గొగవాలేను చీఫ్ విప్గా నియమించారు. మహారాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. ఉద్ధవ్ వర్గానికి చెందిన అజయ్ చౌదరీని చీఫ్ విప్గా నియమించడాన్ని స్పీకర్ తిరస్కరించినట్లు అందులో పేర్కొంది. మహారాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఈ మేరకు ఒక లేఖ విడుదల చేశారు.
కాగా, సీఎం ఏక్నాథ్ షిండే బలపరీక్ష నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఓటు వేయాలంటూ శివసేన ఎమ్మెల్యేలకు రెబల్ వర్గం విప్ జారీ చేసింది. అయితే దీనిని ఉల్లంఘించిన ఆదిత్య ఠాక్రేతో పాటు మరి కొందరు శివసేన ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండేకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో విప్ను ధిక్కరించినందుకు ఆదిత్య ఠాక్రేతోపాటు మిగతా శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు దిశగా రెబల్ వర్గం చర్యలు తీసుకోవచ్చని తెలుస్తున్నది. అయితే షిండేతో సహా రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో వచ్చే సోమవారం జరుగనున్న విచారణపై ఇది ఆధారపడి ఉంటుంది.