ముంబై : శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గాలు తలపడిన నేపధ్యంలో సేన వర్సెస్ సేన రగడపై ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ పేరును లాగేసుకునేందుకు 40 మంది ద్రోహులు, వెన్నుపోటుదారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను అక్రమ సీఎంగా అభివర్ణించారు. బాణం గుర్తును తమకు కేటాయించేలా ఉద్ధవ్ శిబిరం న్యాయ పోరాటానికి దిగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారుడు రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమదే అసలైన శివసేనని షిండే గ్రూపు ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారని ఆయన తప్పుపట్టారు.
ఇక ఉద్ధవ్ ఠాక్రే గ్రూపునకు చెందిన సేన వర్గానికి రానున్న ఉప ఎన్నికలకు ముందు ఈసీ సోమవారం కొత్త పేరు, గుర్తును కేటాయించిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ గ్రూపునకు శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే పార్టీగా, ఎన్నికల గుర్తుగా మండుతున్న టార్చ్ను కేటాయించారు. ఇక ఏక్నాథ్ షిండే గ్రూపును బాలాసాహెబ్ శివసేనగా వ్యవహరిస్తారు.