Aadhaar-Voter ID Card Link | కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆధార్ కార్డు – ఓటర్ ఐడీ కార్డు అనుసంధానికి సంబంధించిన కేసులో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాంగ్రెస్ నేత దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన కోర్టు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో ఓటర్ ఐడీని అనుసంధానం చేసేందుకు ఎన్నికలచట్ట సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఓటర్ ఐడీని ఆధార్తో అనుసంధానం చేయడం పౌరుల గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ పిటిషన్ను విచారించేందుకు నిరాకరించిన కోర్టు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని చెప్పింది. దీంతో ఆయన తన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని, అయితే ఓటర్ ఐడీకార్డు పౌరసత్వ హక్కును ఇస్తుందన్నారు. ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ డేటాతో ఆధార్ డేటాను లింక్ చేయడంతో ఓటర్ల వ్యక్తిగత డేటా చట్టబద్ధమైన అథారిటీకి అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.