కాన్పూర్, నవంబర్ 26: యూపీలో మరో దారుణం జరిగింది. తన ప్రేమను తిరస్కరించిందని కక్ష పెంచుకున్న 26 ఏండ్ల యువకుడు ఆదివారం ఒక యువతిని నరికి చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బిల్హోర్లోని గదన్పూర్ ఆహార్లో నివసించే సురేష్ అలియాస్ కరణ్ తన పొరుగున నివసించే 21 ఏండ్ల షన్నో కశ్యప్కు తన ప్రేమను ప్రతిపాదించాడు. దానిని ఆమె తిరస్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న సురేష్ తన కజిన్, మేనల్లుడితో బైక్పై వస్తున్న షస్నోను రానా గ్రామం వద్ద ఉన్న ఫ్లైఓవర్ వద్ద ఆపి ఆమె మెడపై, తలపై, చేతులపై కత్తి, గొడ్డలితో విచక్షణా రహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్ కోసం గాలిస్తుండగా హత్యా ప్రదేశానికి 10 కిలోమీటర్ల దూరంలో అపస్మారక స్థితిలో కన్పించాడు. అప్పటికే విషం తాగి, నోటి నుంచి నురుగలు రావడం గమనించిన పోలీసులు దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు.