భోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టులో ఓ ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. క్రిమినల్ కేసులో జైలుశిక్ష పడిన ఓ ఖైదీ భార్య ఈ పిటిషన్ వేసింది. తాను తల్లిని కావాలనుకుంటున్నానని, అందుకోసం తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని ఆమె తన పిటిషన్లో అభ్యర్థించింది. కనీసం 15 నుంచి 20 రోజులపాటు తన భర్తను జైలు నుంచి విడుదల చేయాలని కోరింది. పిల్లలను కనడం తన ప్రాథమిక హక్కు అని ఆమె పిటిషన్లో పేర్కొంది.
సదరు మహిళ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఆమె భర్తను విడుదల చేస్తే పిటిషనర్ గర్భం దాల్చే అవకాశం ఉందా లేదా..? అని తెలుసుకోవాలని హైకోర్టు నిర్ణయించింది. సదరు పరీక్షల కోసం పిటిషనర్ ఈ నెల 7న జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ మెడికల్ కాలేజీలో పరీక్షల అనంతరం ఆమెకు తల్లి అయ్యే యోగ్యత ఉందని తేలితే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోర్టు భావిస్తోంది.
అదేవిధంగా పిటిషనర్కు పరీక్షల నిర్వహణ కోసం నిపుణులైన వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ను జస్టిస్ వివేక్ అగర్వాల్తో కూడిన మధ్యప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆ వైద్యుల బృందం పిటిషనర్ గర్భం దాల్చడానికి శారీరకంగా దృఢంగా ఉందో లేదో పరీక్షిస్తుంది. కేసు తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 22కు వాయిదా వేసింది.