Eknath Shinde | వచ్చేనెల 11 వరకు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొద్దని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు.. `బాలాసాహెబ్ హిందుత్వకు విజయం` అని శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సర్కార్కు వ్యతిరేకంగా షిండే సారధ్యంలో శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.
షిండే శిబిరంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయితే, షిండేతోపాటు 15 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ నరహరి జార్వార్కు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గం పిటిషన్ సమర్పించింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల్లోపు తన ముందు హాజరు కావాలని డిప్యూటీ స్పీకర్.. సంబంధిత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
దీనిపై షిండే గ్రూప్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దీనిపై ఏక్నాథ్ షిండే స్పందించారు. `హిందువుల హృదయ సామ్రాట్.. బాలా సాహెబ్ ఠాక్రే హిందుత్వది, ధర్మవీర్ ఆనంద్ డిఘే సాహెబ్ సిద్ధాంతాల విజయం ఇది` అని మరాఠీలో ట్వీట్ చేశారు.