ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ హాట్గా మారాయి. ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీలో చేరితే తాము ప్రభుత్వంలో ఉండబోమని సీఎం ఏక్నాథ్ షిండే ( Eknath Shinde) నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం హెచ్చరించింది. ఆ వర్గం ప్రతినిధి సంజయ్ శిర్సాత్ మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ నేరుగా బీజేపీతో కలువబోదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్సీపీ గురించి తమ విధానం స్పష్టంగా ఉందన్నారు. ‘ఎన్సీపీ ద్రోహం చేసే పార్టీ. మేం అధికారంలో ఉన్నా ఎన్సీపీతో కలిసి ఉండబోం. బీజేపీ ఎన్సీపీతో చేతులు కలుపడం మహారాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదు. అలాంటి పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ప్రజలకు ఇష్టం లేదు. అందుకే ఠాక్రే వర్గాన్ని వీడి బయటకు వచ్చాం’ అని తెలిపారు.
కాగా, ఎన్సీపీని వీడుతున్నట్లు అజిత్ పవార్ చెప్పలేదని సంజయ్ అన్నారు. అయితే ఆయన ఎన్సీపీని వీడితే తాము స్వాగతిస్తామని చెప్పారు. అజిత్ పవార్ కుమారుడు పార్థా పవార్ ఎన్నికల్లో ఓడిపోవడం వల్లనే ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత అంశానికి దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2019లో సీఎంగా దేవేందర్ ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవర్ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించడం వంటి పరిణామం మళ్లీ జరిగితే మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వస్తుందన్నారు.