న్యూఢిల్లీ : దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల ధరలకు రెక్కలు రానున్నాయి. భారత్ లో తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను శనివారం నుంచి పెంచనున్నట్టు టాటా మోటార్స్ ప్రకటించింది. ఇప్పటికే కార్లను బుక్ చేసుకుని డెలివరీకి వేచిచూస్తున్న వారికి ధరల పెంపు వర్తించబోదని కంపెనీ స్పష్టం చేసింది. వ్యాపార వ్యూహ ప్రణాళికలో భాగంగా ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రణాళికలో కస్టమర్లు, డీలర్లు, సరఫరాదారుల ప్రయోజనాలనూ కాపాడేందుకూ కంపెనీ చొరవ చూపుతుందని టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్స్ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర పేర్కొన్నారు.
ఇక స్టీల్ ఇతర లోహాల ధరల పెరుగుదలతో కొంత భారాన్ని వినియోగదారులకు మళ్లించక తప్పలేదని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఏయే మోడల్ పై ధర ఎంత పెరుగుతుందనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. అయితే భారత్ లో తమ అన్ని కార్లపై సగటున 1.8 శాతం వరకూ ధరలు పెరుగుతాయని, మోడల్స్ వాటి వేరియంట్స్ కు అనుగణంగా ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది.