ముంబై, ఆగస్టు 9: మహారాష్ట్రలో కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఏక్నాథ్షిండే.. 40 రోజుల తర్వాత తన మంత్రివర్గాన్ని మంగళవారం విస్తరించారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, రెబల్ శివసేన నుంచి తొమ్మిది మందికి క్యాబినెట్లో స్థానం కల్పించారు. ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ బీఎస్ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు.
సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్ కొనసాగుతున్న 20 మంది సభ్యుల క్యాబినెట్లో ఒక్క మహిళకు కూడా స్థానం దక్కలేదు. మరోవైపు ఓ మహిళతో సంబంధం నడిపి ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పాడనే ఆరోపణలతో ఉద్దవ్ ఠాక్రే మంత్రివర్గం నుంచి వైదొలగిన సంజయ్రాథోడ్కు మళ్లీ మంత్రి పదవి ఇవ్వడంపై మహిళా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.