న్యూఢిల్లీ: భారత్లో మెజార్టీ ప్రజలు నిరంకుశ, సైనిక పాలనకు మద్దతు తెలుపుతున్నారని తాజా సర్వే నివేదిక పేర్కొన్నది. సర్వే చేసిన దేశాల్లో ఈ విషయంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నదని ఇటీవల విడుదలైన ‘ప్యూ రీసెర్చ్ సర్వే’ వెల్లడించింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, నిరంకుశత్వం, సైనిక పాలన సహా వివిధ పాలనా రూపాలపై 24 దేశాల్లోని పౌరుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. సర్వేలో పాల్గొన్న వారిలో 67% మంది భారతీయులు నిరంకుశ పాలనకు మద్దతు తెలిపారని, ఇది 2017లో 55 శాతంగా ఉండేదని ప్యూ రిసెర్చ్ డాటా వెల్లడించింది.
మిలటరీ పాలనకు కూడా భారత్లో భారీ మద్దతు ఉన్నదని, అన్ని దేశాల కంటే అధికంగా 72 శాతం మంది మద్దతు తెలిపారని సర్వే చెప్పుకొచ్చింది. మరోవైపు నిరంకుశ పాలనకు కెన్యాలో 52 శాతం మంది ఆమోదం పలుకగా.. ఇండోనేషియాలో 51% మంది ఓటేశారు. అమెరికాలో 26%, కెనడాలో 19%, యూకేలో 13% మంది మాత్రమే నిరంకుశ పాలనకు మద్దతు తెలిపారు. చట్టసభలు లేదా స్వతంత్ర న్యాయవ్యవస్థ జోక్యం లేకుండా బలమైన నాయకుడు నిర్ణయాలు తీసుకొనే అధికారం ఉన్న వ్యవస్థను పరిగణనలోకి తీసుకొంటారా? అని సర్వేలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు.