న్యూఢిల్లీ, అక్టోబర్ 3: టైప్-2 డయాబెటిస్ బారినపడిన వారి ఆయుర్దాయం తగ్గుతుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. 30 ఏండ్లకే టైప్-2 డయాబెటిస్ వచ్చిన వారి ఆయుర్దాయం 14 ఏండ్లు తగ్గుతుందని, 50 ఏండ్లకు వస్తే 6 ఏండ్లు తగ్గుతుందని కేంబ్రిడ్జ్, గ్లాస్గో యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు, కిడ్నీ సమస్యల బారినపడే ముప్పు పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధన ఫలితాలు లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా యువత టైప్-2 డయాబెటిస్ బారిన పడుతున్నదని పేర్కొన్నారు.