ముంబై, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని థాణే జిల్లాలో ఓ గర్భిణి సమయానికి దవాఖానకు వెళ్లలేక నడిరోడ్డుపైన్నే ప్రసవించింది. సీఎం ఏక్నాథ్ షిండే సొంత నియోజకవర్గం, ఆయన దత్తత తీసుకున్న గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. షాపూర్ తాలుకాలో పాటకీచా పాడా గ్రామానికి చెందిన ప్రణాళి వాఘేను డోలిలో తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ప్రసవించింది.
సమీపంలోని ఓ గ్రామం వద్ద ఆశా వర్కర్లు వాహనం ఏర్పాటుచేయగా, అక్కడ్నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లి బిడ్డ సురక్షితంగా ఉన్నారని ఆరోగ్య కేంద్రం డాక్టర్ సువేదిక సొనావణే తెలిపారు. కాగా, 2018లోనే గ్రామానికి రోడ్డు మంజూరైనా.. ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదు. దీంతో వర్షాకాలంలో అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.