హైదరాబాద్ : కేరళ రాష్ట్రంలో (Kerala)లో నిఫా వైరస్ (Nipah Virus ) కలకలం రేపింది. తాజాగా కోజికోడ్ (Kozhikode) జిల్లాకు చెందిన 43 ఏండ్ల వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. సదరు వ్యక్తికి గిడ్డంగిని శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతడిని పరీక్షించిన వైద్యులు రోగి శాంపిల్స్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. పరీక్ష ఫలితాలు నేడు వెలువడే అవకాశం ఉందని, ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం కోజికోడ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. నిఫా పరిస్థితులపై అంచనా వేసి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో తీసుకోవాల్సిన చర్యలపై నేడు చర్చించనున్నారు. ఎన్ఐవి (NIV) పరీక్ష ఫలితాల ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఆంక్షలు విధించడంపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. రోగి పలువురితో కలిసి తిరిగినందున ఆరోగ్య శాక అధికారులు ఇప్పటికే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రారంభించారు.
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కె. మురళీధరన్
కాగా, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె. మురళీధరన్ మాట్లాడుతూ.. నిఫాపై ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసంర లేదన్నారు. నిఫా సోకిందని అనుమానిస్తున్న సదరు రోగి మొదట చికిత్స కోసం పలు ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో వైరస్ సోకే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని మంత్రి తెలిపారు.
ముందస్తు జాగ్రత్త చర్యగా ఆ రోగితో సన్నిహితంగా మెలిగిన హాస్పిటల్ సిబ్బందిని క్వారంటైన్లో ఉండాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. పరిస్థితిని సమీక్షించి, తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు గురువారం తిరువనంతపురంలోని ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశామన్నారు.