న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను చంపేందుకు ఓ వ్యక్తి పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చేందుకు యత్నించాడు. కానీ అతన్ని ప్రయత్నాన్ని నిఘా వర్గాలు అడ్డుకున్నాయి. అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించిన పాక్ దేశస్థుడిని, రాజస్థాన్ శ్రీ గంగానగర్ జిల్లాలో నిఘా సంస్థలు గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి.
ఈ సందర్భంగా బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. జులై 16వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో పాకిస్తాన్ దేశస్థుడిని హిందూమాల్కోట్ బోర్డర్ ఔట్ పోస్టు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సరిహద్దు దాటి అనుమానాస్పదంగా తిరుగుతున్న అతన్ని పెట్రోలింగ్ టీమ్ గుర్తించి అరెస్టు చేశారని పేర్కొన్నారు. అతని వద్ద 11 ఇంచుల కత్తి, ఓ మతానికి సంబంధించి పుస్తకాలు, బట్టలు, ఆహారంతో పాటు ఇసుకను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
తాను పాకిస్తాన్ నార్తర్న్ పంజాబ్లోని మండి బహుద్దీన్ సిటీకి చెందిన రిజ్వాన్ ఆష్రఫ్గా చెప్పుకున్నాడు. నుపుర్ శర్మను చంపేందుకు పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించానని తెలిపాడు. నుపుర్ శర్మను చంపే కంటే ముందు రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాను సందర్శించాలని ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులకు వివరించాడు.