న్యూఢిల్లీ: ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లలో కొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్ 29న ఒకే రోజు రూ.193.15 కోట్లు వసూలైనట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) వెల్లడించింది. ఫాస్టాగ్ ప్రారంభించిన నాటి నుంచి ఒక్క రోజు వసూళ్లలో ఇదే అత్యధికం. ఇక, నగదు ద్వారా వసూలైనవి కూడా కలిపితే ఒక్క రోజే దాదాపు రూ.200 కోట్లకు పైనే ఉండొచ్చని అంచనా.
ఆ రోజు ఫాస్టాగ్ ద్వారా 1.16 కోట్ల టోల్ లావాదేవీలు నమోదైనట్టు ఎన్హెచ్ఏఐ తెలిపింది. కాగా, 2021 ఫిబ్రవరిలో ఫాస్టాగ్ను తప్పనిసరి చేసింది. మొత్తం ఫాస్టాగ్ అమలులోకి తెచ్చిన టోల్ప్లాజాల సంఖ్యను 770 నుంచి 1,228కి పెంచినట్టు ఎన్హెచ్ఏఐ పేర్కొన్నది. ఇందులో 339 స్టేట్ టోల్ ప్లాజాలు కూడా ఉన్నాయి.