జైపూర్: అల్లుళ్లకు అత్తగారిళ్లలో రాచమర్యాదలు చేస్తుంటారు. పంచభక్ష పరమాన్నాలు వండిపెడుతారు. ఇరుగుపొరుగుకు అల్లుడి గురించి గొప్పలు చెబుతూ మురిసిపోతుంటారు. బిడ్డ, అల్లుడు కళ్ల ముందు ఆనందంగా గడుపుతుంటే చూసి ఉప్పొంగిపోతారు. అయితే కొందరు అల్లుళ్ల పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం నాగౌర్ జిల్లాలోని ఓ గ్రామంలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఓ అల్లుడిపై అత్తింటివాళ్లు కక్షగట్టారు. అత్త, మామ, బావమరిది అందరూ అతడిపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో అల్లుడికి తగిన శాస్తి చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. అజ్మీర్ జిల్లాలో కాపురం ఉంటున్న వాళ్ల ఇంటికి వెళ్లి అల్లుడిని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి నాగౌర్ జిల్లాలోని వారి స్వగ్రామానికి అతడిని తీసుకెళ్లారు. అక్కడ అల్లుడి ముక్కు కోసి విడిచిపెట్టారు.
అయితే అత్తింటివాళ్లు అల్లుడి ముక్కు కోయడానికి కారణం ఏందంటే.. ఆ ఇంటి ఆడబిడ్డ ప్రేమ వివాహం చేసుకోవడమే. ఆమె ప్రేమ వివాహం ఆ కుటుంబంలో ఎవరికీ నచ్చలేదు. వద్దని చెబితే ఆమె వినిపించుకోలేదు. తనకు అతడే కావాలని పట్టుబట్టి పెళ్లిచేసుకుంది. దాంతో అల్లుడిపై అత్తింటివాళ్లు కక్ష కట్టారు. ఆఖరికి అదును చూసి అల్లుడిని అపహరించి ముక్కుకోశారు.
కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన బాధ్యులైన నిందితుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.