న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. ఏడేండ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ఓ మహిళను గుట్టుచప్పుడు కాకుండా హతమార్చి ఇంటికి తాళం పెట్టాడు. ఆ తర్వాత పంజాబ్లోని తన స్వస్థలానికి పారిపోయాడు. మృతురాలి కుమార్తె, బంధువుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెలుగుచూసింది. తిలక్ నగర్ ఏరియాలోని తన నివాసంలో ఆమె విగతజీవిగా పడివుంది. దాంతో పోలీసులు నిందితుడి కోసం ట్రేస్ చేయగా.. అతను పంజాబ్లోని తన స్వస్థలంలో ఉన్నట్లు తేలింది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్కు చెందిన మన్ప్రీత్ సింగ్, ఢిల్లీకి చెందిన రేఖారాణి 2015 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఢిల్లీలోని రేఖారాణి నివాసంలోనే ఆమె 15 ఏండ్ల కుమార్తెతో కలిసి వాళ్లు ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 1న మన్ప్రీత్ రేఖారాణి కుమార్తెకు మత్తుమందు ఇచ్చి రేఖారాణిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గదిలో దాచేశాడు.
ఆమె కుమార్తె మత్తు నుంచి తేరుకుని తల్లి కోసం ఆరా తీయగా మార్కెట్కు వెళ్లిందని చెప్పాడు. అతని తీరును అనుమానించిన కుమార్తె తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఇంతలో మన్ప్రీత్ పారిపోయాడు. దాంతో వారు రేఖారాణి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇంట్లో తాళం వేసి ఉన్న గది తలుపులు పగలగొట్టి చూడగా హత్య విషయం వెలుగుచూసింది.