చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో దారుణం జరిగింది. పుట్టింటికి వెళ్లిన భార్య కాపురానికి రానన్నదని ఆగ్రహించిన ఓ భర్త.. భార్యతోసహా ఆమె కుటుంబసభ్యులు ఐదుగురిపై కిరోసిన్పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో బాధితులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పరంజీత్ కౌర్ అనే మహిళ తన మొదటి భర్త మరణించడంతో కుల్దీప్ సింగ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తకు కలిగిన ఇద్దరు సంతానంతో సహా అతనితో ఉంటుంది. అయితే కుల్దీప్ నిత్యం తాగివచ్చి కొడుతుండటంతో ఆరు నెలల క్రితం పరంజీత్ తన ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది.
ఆ తర్వాత కుల్దీప్ కాపురానికి రమ్మని పిలిచినా రాలేదు. దాంతో కోపం పెంచుకున్న కుల్దీప్.. పరంజీత్ కౌర్ పుట్టింటికి వెళ్లి వాళ్లంతా నిద్రలో ఉన్న సమయంలో కిరోసిన్ పోసి నిప్పంటించి పారిపోయాడు. పరంజీత్ కౌర్, ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.