న్యూఢిల్లీ: పదకొండేండ్ల క్రితం జరిగిన అత్యాచారం, హత్య కేసులో అతడు మరో ఇద్దిరితో కలిసి జైలుకు వెళ్లాడు. విచారణ జరిపిన కింది కోర్టు ముగ్గురికీ మరణశిక్ష విధించింది. హైకోర్టు సైతం కింది కోర్టు తీర్పును సమర్థించింది. కానీ, సుప్రీంకోర్టు వాళ్లను విడిచిపెట్టింది. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కేసును కొట్టివేసింది. దాంతో మూడు నెలల క్రితం ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు. వాళ్లలో ఒకడు మళ్లీ హత్య చేసి జైలుకెళ్లాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ హత్య జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. వినోద్ (35) అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి 2012 ఫిబ్రవరిలో 19 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆమెను చంపేశారు. ఈ కేసులో కింది కోర్టు ముగ్గురినీ దోషులుగా తేల్చి మరణశిక్షలు విధించింది. దాంతో నిందితులు హైకోర్టుకు వెళ్లారు. కేసు వివరాలను పరిశీలించి హైకోర్టు కూడా మరణిశిక్షలను సమర్థించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవంటూ బెనెఫిట్ ఆఫ్ డౌట్ కింద కేసును కొట్టివేసింది. దాంతో మూడు నెలల క్రితం నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు. మరణశిక్ష తప్పి మళ్లీ బతికే అవకాశం వచ్చినా వినోద్ బుద్ధి మారలేదు. గత నెల 26న వేరే ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆటో డ్రైవర్ను దోచుకునే ప్రయత్నం చేశాడు.
అయితే, ఆటో డ్రైవర్ ప్రతిఘటించడంతో వినోద్ అతని గొంతు కోశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వెంటనే పవన్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులకు వినోద్ గురించి తెలిసింది. వెంటనే అతని కోసం గాలింపులు చేపట్టిన పోలీసులు గత నెల 29న అరెస్ట్ చేశారు. ఒక కేసులో చావు నోట్లో తలపెట్టి బయటపడ్డా నిందితుడి బుద్ధి మారకపోవడంతో మళ్లీ జైలుపాలు కావాల్సి వచ్చింది.