గ్వాలియర్: ఓ వ్యక్తి తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్ను క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రిగ్గర్పై వేలుపడింది. అంతే ఆ రైఫిల్లోంచి తూటా దూసుకొచ్చి నేరుగా అతని తలలోకి వెళ్లింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రం బింద్ జిల్లాలోని గ్వాలియర్ సిటీలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అభిషేక్ సక్సేనా అనే వ్యక్తి వృత్తిరీత్యా జర్నలిస్టు. గ్వాలియర్ సిటీలోని డర్పన్ కాలనీలో తల్లి, తండ్రి, భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్న అతనికి ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం అభిషేక్ సక్సేనా తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రైఫిల్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలింది. ఈ ఘటనలో అభిషేక్ సక్సేనా స్పాట్లో మరణించాడు.
ప్రమాదం జరిగిన సమయంలో అభిషేక్ సక్సేనా కింది ఫ్లోర్లో ఉండగా, కుటుంబసభ్యులందరూ పై ఫ్లోర్లో ఉన్నారు. రైఫిల్ పేలిన శబ్దం విని వాళ్లు కిందికి వచ్చి చూడగా సక్సేనా రక్తపు మడుగులో పడివున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.