గోద్రా, ఏప్రిల్ 2: గుజరాత్లో 21 ఏండ్ల నాటి సామూహిక హత్యలు, అత్యాచారాల కేసులో స్థానిక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2002 ఫిబ్రవరి 27 గోద్రాలో సబర్మతి రైలును అల్లరిమూకలు తగులబెట్టడాన్ని నిరసిస్తూ మార్చి 1న నిర్వహించిన గుజరాత్ రాష్ట్ర బంద్ సందర్భంగా పంచ్మల్ జిల్లా కలోల్లో మైనారిటీ వర్గానికి చెందిన 11 మందిని ఓ వర్గంవారు సజీవదహనం చేశారు.
కొందరు మహిళలపై సామూహిక లైంగికదాడులకు పాల్పడ్డారు. ఈ దారుణంపై మార్చి 2న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి 39 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసు సుదీర్ఘ విచారణ సమయంలోనే నిందితుల్లో 13 మంది మరణించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 190 మంది సాక్షులను విచారించింది. 334 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. అయినా, నిందితులే నేరం చేశారనేందుకు సరైన సాక్ష్యాలు లేవని పేర్కొంటూ హలోల్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి లీలాభాయ్ చూడాసమా తీర్పు చెప్పారు.