వయనాడ్: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి సమీపంలో జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడింది. మూల మలుపు వద్ద జీపు కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్న లోయలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. డ్రైవర్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వేళ్తే.. తేయాకు తోటల్లో కూలీలుగా పనిచేసే 11 మంది మహిళలు శుక్రవారం పని ముగించుకుని దీపు టీ ట్రేడింగ్ కంపెనీకి చెందిన జీపులో ఇళ్లకు బయలు దేరారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మనంతవాడి సమీపంలో జీపు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు.
తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మనంతవాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, ఘటనపై కేరళ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సీఎం ఆదేశాల మేరకు అటవీశాఖ మంత్రి ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు.