లక్నో : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొంతమంది సాధువులు హోమం నిర్వహించి, లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. లెజెండరీ సింగర్ను ప్రధాని మోదీ కలవాలని వారు విజ్ఞప్తి చేశారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న లతా మంగేష్కర్ ఈ నెల 8న ముంబైలోని బ్రీచ్ క్యాండి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
లతా మంగేష్కర్ ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని, అయితే ఐసీయూలోనే ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి ఐసీయూలో ఉంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ను ఆస్పత్రి యాజమాన్యం అందిస్తూనే వస్తున్నది.
లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని ఇటీవల తెలిపారు. అయితే, రెండువారాలకుపైగా ఆమె ఐసీయూలోనే ఉండడంతో రూమర్లు వెలువడగా.. సోషల్ మీడియాలో లతాజీ ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో లతా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లతామంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయొద్దని లతాజీ అధికారిక ట్విట్టర్ ద్వారా కోరారు.