న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది ( Building Collapse ). ఢిల్లీలోని సబ్జి మండి ఏరియాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద నుంచి తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న మిగతావారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
స్థానిక పోలీసులు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ దళం అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారని ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్ఎస్ బుందేలా చెప్పారు. శిథిలాల కింద ఎంత మంది ఉండవచ్చనే వివరాలు తెలియడానికి మరికొంత సమయం పడుతుందని ఆయన తెలిపారు. ఇప్పటివరకైతే తలకు తీవ్ర గాయమైన ఓ వ్యక్తిని రక్షించి ఆస్పత్రికి తరలించారని చెప్పారు.