న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో ప్రేమికులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఓ కారులో ఆ ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. అశోక్నగర్లో ఈ ఘటన జరిగింది. పార్క్ చేసిన కారులో ఆ జంట శవాలను గుర్తించారు. డ్రైవర్ సీటులో ఉన్న వ్యక్తిని రితిక్ సోనీగా అనుమానిస్తున్నారు. అతని తలలో బుల్లెట్ దిగింది. ముఖంపై కాలిన గాయాలు కూడా ఉన్నాయి. ఇక ఆ కారులోనే పక్క సీటులో ఉన్న మహిళను ముస్కాన్గా గుర్తించారు. ఆమె గొంతు కోసి ఉన్నది. ఆ ఇద్దరూ అశోక్నగర్ వాసులే.
ముస్కాన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం మధ్యాహ్నం జిమ్కు వెళ్తున్నట్లు చెప్పి ముస్కాన్ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ ఆమె మళ్లీ తిరిగిరాలేదు. కాంటాక్ట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో కోత్వాలి పోలీసు స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. రితిక్ ఫ్యామిలీ తమ ఫిర్యాదులో 15 రోజుల క్రితమే అతను ఇండోర్ నుంచి అశోక్నగర్ చేరుకున్నట్లు చెప్పారు. నా కుమారుడు రితిక్ మృతదేహాన్ని కారులో ఉన్నట్లు గుర్తించానని అతని తండ్రి రాకేశ్ సోని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
క్రైం సీన్కు ఫోరెన్సిక్ పోలీసులు చేరుకున్నారు. ఆధారాలను సేకరిస్తున్నారు. కారులో నుంచి ఓ పిస్తోల్, రక్తంతో నిండిన గొడ్డలి, కట్టర్ను రికవరీ చేశారు. కారు నుంచి 50 మీటర్ల దూరంలో మూడు మొబైల్ ఫోన్లను కూడా సేకరించారు. పోస్టు మార్టమ్ కోసం ఆ ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి పంపారు. అయితే ఆ జంట గతంలో ఇండోర్లోని ఓ ప్రైవేటు కంపెనీలో కలిసి పనిచేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.
అన్ని కోణాల్లో ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. పోస్టుమార్టమ్, ఫోరెన్సిక్ రిపోర్టులు వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.