న్యూఢిల్లీ, జూలై 25: కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయం, అమర సైనికుల త్యాగానికి గుర్తుగా జరుపుకొనే కార్గిల్ విజయ్ దివస్ వేడుకులకు దేశం సిద్ధమైంది. నేడు(జూలై 26) జరుగనున్న 24వ కార్గిల్ విజయ దినోత్సవ వేడుకులకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని ఢిల్లీతో పాటు అన్ని రాష్ర్టాల్లో ప్రభుత్వాధినేతలు, అధికారులు, ప్రజలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొని కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికులకు నివాళులర్పించనున్నారు. భారత సైన్యం సాధించిన విజయాన్ని, దేశాన్ని కాపాడుకోవడంలో అమర జవాన్లు చేసిన త్యాగాలను స్మరించుకోనున్నారు.
1999, జూలై 26న కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ సైన్యంపై భారత్ సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ కార్గిల్ విజయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. సరిహద్దుల్లో భారత భూభాగంలోకి చొరబడిన పాకిస్థాన్ సైన్యాన్ని భారత సైన్యం ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో కార్గిల్ ప్రాంతంలో సమర్థంగా తిప్పికొట్టింది. కార్గిల్ జిల్లాలో ఆక్రమించుకొన్న ప్రాంతాల నుంచి పాక్ బలగాలను వెనక్కు తరిమికొట్టింది. ఈ యుద్ధంలో సాధించిన విజయం.. భారత సైన్యానికి ఓ గేమ్ చేంజర్గా చెప్పొచ్చని, అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇది కీలక దశ అని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. శత్రువులను తిప్పికొట్టడంలో ఆర్మీ సమర్థతను ఈ యుద్ధం ఎత్తిచూపింది. దీని ద్వారా సరిహద్దులో పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదాన్ని భారత్ ప్రపంచం ముందు ఉంచింది.
1971 తర్వాత ఇదే..
కశ్మీర్ను ఆక్రమించుకోవాలన్న కుట్రతో పాక్ సైన్యం ఆపరేషన్ బదర్ పేరుతో సరిహద్దులోకి వచ్చారు. కార్గిల్ యుద్ధం 1999, మే 3 నుంచి జూలై 26 వరకు జరిగింది. రెండు నెలలకు పైగా మంచు పర్వతాల్లో పోరాటం జరిగింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు అమరులయ్యారు. 1971 తర్వాత భారత్-పాక్ మధ్య జరిగిన యుద్ధం ఇదే కావడం గమనార్హం. కాగా, కమాండింగ్, నియంత్రణ, క్రమశిక్షణ చర్యలకు సంబంధించి త్రివిధ దళాల్లో థియేటర్ కమాండర్లకు అధికారాలు కల్పించే ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్-2023 బిల్లుకు రక్షణ రంగ పార్లమెంటరీ స్టాండింగ్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది త్వరలో ఉభయ సభల ఆమోదంతో చట్టంగా మారనున్నది.