చండీగఢ్: చరణ్జీత్ సింగ్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని పంజాబ్ బీజేపీ విమర్శించింది. ఆ రాష్ట్రంలోని దళితుల ఓట్లను దోచుకోవడానికే దళితుడైన చరణ్జీత్కు ముఖ్యమంత్రి పదవి అప్పగించిందని ఆరోపించింది. ఇది కాంగ్రెస్కు ఉన్న పాత అలవాటేనని పంజాబ్ బీజేపీ ఇన్చార్జి దుష్యంత్ గౌతమ్ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల ముందు దళితుడిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పంజాబ్లోని దళితుల ఓట్లన్నీ కొల్లగొట్టవచ్చని కాంగ్రెస్ వాళ్లు భావిస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే ఓ షో నడిపించారని విమర్శించారు.
కాంగ్రెస్ గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చేసిందని దుష్యంత్ గౌతమ్ ఆరోపించారు. ఓట్ల కోసం దళితులను ముందుపెట్టి పరిపాలన మాత్రం ఇతరుల చేతుల్లో పెడుతారని విమర్శించారు. వాళ్లు ఎప్పుడు దళితులకు ఉన్నత పదవులు కట్టబెట్టినా ఆ తర్వాత అవమానించి పార్టీ నుంచి బయటికి గెంటేస్తారని వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే చేసిందని దుష్యంత్ గౌతమ్ గుర్తుచేశారు.