మొహాలీ: పంజాబ్లోని మొహాలీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈడీ దాడుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్రన్ టవర్స్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇంతలో భవనంలోని 9వ అంతస్తు నుంచి డబ్బు కట్టలతో కూడిన రెండు బ్యాగులను కిందికి విసిరివేయడం కలకలం రేపింది. నితిన్ బన్సాల్ ఇంటిపై ఈడీ దాడులు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన ఈడీ అధికారులు కింద పడిన డబ్బు కట్టులతో కూడిన బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు బ్యాగులలో మొత్తం 21 లక్షల నగదు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఈడీ బృందం మొహాలీ, చండీగఢ్లలో 12 ప్రాంతాలలో సోదాలు చేపట్టింది. సన్సెట్ సిటీ ప్రాజెక్టు కుంభకోణం, వివిధ పర్మిట్ల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వస్తున్న దరిమిలా ఈడీ ఈ దాడులు నిర్వహిస్తున్నది. పలువురు బిల్డర్లు ప్రభుత్వ రుసుములను చెల్లించడంలో అవకతవకలకు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తున్నది.
వ్యాపారవేత్త నితిన్ గోహల్కు సంబంధించిన ఇండ్లలోనూ ఈడీ తనిఖీలు చేపట్టింది. నితిన్ గోహల్ ప్రభుత్వానికి బిల్డర్లకు మధ్యవర్తిగా ఉంటూ, అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. నితిన్ గోహల్ పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని కీలక అధికారులకు సన్నిహితుడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఈడీ అధికారులు నితిన్ గోహల్ ఇంటిలో పలు దస్తావేజులు, బ్యాంకు రికార్డులను పరిశీలించినట్లు సమాచారం.