న్యూఢిల్లీ, ఆగస్టు 30: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి చరిత్రలో తొలిసారిగా 99.04 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత 8 శాతం వరకు పెరిగింది. బాలురతో పోలిస్తే బాలికలు ఈ ఏడాది 0.35 శాతం మేర అధికంగా ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 99.24 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 98.89 శాతం మంది పాస్ అయ్యారు. లింగమార్పిడి చేసుకున్న విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ వెల్లడించారు. 16,639 విద్యార్థుల ఫలితాలు ఇంకా మూల్యాంకన దశలో ఉన్నాయని తెలిపారు. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ఈ ఏడాది సీబీఎస్ పది పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో మెరిట్ లిస్ట్ను, మెరిట్ సర్టిఫికెట్లను విడుదల చేయడం లేదని తెలిపారు. 57,824 మంది విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు, 2,00,962 మంది విద్యార్థులు 90-95 శాతం మార్కులు సాధించారని పేర్కొన్నారు. దివ్యాంగులైన విద్యార్థుల క్యాటగిరీలో 53 మంది విద్యార్థులు 95 శాతం, 224 మంది విద్యార్థులు 90-95 శాతం మార్కులు సాధించారన్నారు. కంపార్ట్మెంట్ క్యాటగిరీలో 17,636 మంది విద్యార్థులను ఉంచినట్టు తెలిపారు. వీరికి ఆగస్టు 16-సెప్టెంబర్ 15 మధ్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
తెలంగాణ విద్యార్థులు 99.99 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు 99.99 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 31,607 మంది పరీక్షలకు హాజరుకాగా 31,605 మంది పాసయ్యారు. ఉత్తీర్ణులైనవారిలో బాలురు 17,502 మంది, బాలికలు 14,103 మంది ఉన్నారు.