అహ్మదాబాద్, నవంబర్ 28: 2016-17 నుంచి 2020-21 మధ్య ఐదు ఆర్థిక సంవత్సరాల్లో గుజరాత్లో కార్పొరేట్/వ్యాపార సంస్థల మెజార్టీ విరాళాలు బీజేపీకే వెళ్లాయి. రాష్ట్రంలోని నాలుగు పార్టీలకు(బీజేపీ, కాంగ్రెస్, ఆప్, ఎస్కేఎం) ఈ ఐదేండ్ల కాలంలో రూ.174.06 కోట్ల విరాళాలు రాగా, అందులో అధికార బీజేపీ రూ.163.54(94 శాతం) పొందిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తాజా నివేదికలో వెల్లడించింది. కార్పొరేట్ విరాళాలపై రాజకీయ పార్టీలు ప్రకటించిన వివరాల ఆధారంగా ఏడీఆర్ ఈ గణాంకాలు వెల్లడించింది. బీజేపీ తర్వాత రూ.10.46 కోట్లతో కాంగ్రెస్ రెండోస్థానంలో ఉన్నది. ఈ ఐదేండ్ల వ్యవధిలో 1,571 కార్పొరేట్ సంస్థలు లేదా వ్యక్తులు విరాళాలు ఇవ్వగా.. అందులో 1,519 విరాళాలు బీజేపీకే రావడం గమనార్హం. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏడీఆర్ నివేదిక విడుదల చేసింది.
గుజరాత్కు యూత్ ఫర్యాంటి కరప్షన్ టీం
హైదరాబాద్, నవంబర్28 (నమస్తే తెలంగాణ): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకుగానూ ఆ రాష్ర్టానికి హైదరాబాద్కు చెందిన యూత్ ఫర్ యాంటి కరప్షన్ బృందం బయలుదేరి వెళ్లింది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకులు రాజేంద్ర పల్నాటి సోమవారం వెల్లడించారు. తమ సంస్థను జాతీయ స్థాయిలో బలోపేతం చేయడంలో భాగంగా గుజరాత్కు వెళ్లినట్టు చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థుల పనితీరు, అభ్యర్థులపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే సమాచారాన్ని సేకరిస్తామన్నారు. వారం నుంచి రెండు, మూడు బృందాలు గుజరాత్లోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్నాయన్నారు. ప్రధాన బృందం సభ్యులు ముడావత్ రమేశ్నాయక్, జీ హరిప్రకాశ్, అంజూకర్ ఆధ్వర్యంలో బృందాలు గుజరాత్లో విస్తృతంగా పర్యటిస్తున్నాయని చెప్పారు.