న్యూఢిల్లీ : విదేశాల్లో ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న స్వదేశీ విద్యార్థులపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో మెడిసిన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు.. ఇండియాలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని ఆయన వాపోయారు. అలాంటప్పుడు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో మెడిసిన్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు.. ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్(FMGE) లో ఉత్తీర్ణత సాధించాలి. అప్పుడే వారికి స్వదేశంలో ప్రాక్టీస్కు అనుమతి లభిస్తుంది.
అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై పలువురు విద్యార్థులు స్పందించారు. ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువగా ఉన్నాయని, నీట్లో అర్హత సాధించినప్పటికీ సీట్లు పొందలేకపోతున్నామని స్పష్టం చేశారు. ఒక వేళ ఇండియాలోనే ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసిన డాక్టర్లు.. ఈ దేశ జనాభాకు సరిపోరు అని పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లు తిరిగి ఇండియాలో ప్రాక్టీస్ చేయకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని తెలిపారు. డాక్టర్ల కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే వారని చెప్పారు.